* పలు మోసాల కేసుల్లో కీలక నిందితుడిగా గుర్తింపు.. ఏడు కేసులకు సంబంధించి దర్యాప్తులో కీలక ఆధారాలు..
* 11 గృహ రుణ లావాదేవీల్లో రూ.4.11 కోట్ల మోసం వెలుగులోకి.. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలింపు..
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 2:
నకిలీ స్థిరాస్తి పత్రాలు, మోసపూరిత రిజిస్ట్రేషన్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ సబ్రిజిస్ట్రార్ ఏ9 మహమ్మద్ యూసుఫ్ - ఉర్ - రహ్మాన్ ను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు స్థిరాస్తి మోసం కేసుల దర్యాప్తులో ఆయన పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. క్రైం నంబర్లు 723/2021, 714/2025, 419/2025, 241/2025, 195/2023, 84/2026, 928/2025 కేసుల్లో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ లోని మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరి జోన్ డిసిపి సిహెచ్ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా నకిలీ, కల్పిత, తారుమారు చేసిన స్థిరాస్తి పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించి, వాటిని తదుపరి ఆస్తి లావాదేవీలు, గృహ రుణాల కోసం ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు డీసీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా క్రైం నంబర్ 928/2025లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులను రుణగ్రహీతలుగా వినియోగించి, నకిలీ ఆస్తి పత్రాల ఆధారంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందిన వ్యవస్థీకృత మోసం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 11 మోసపూరిత గృహ రుణ లావాదేవీల ద్వారా సుమారు రూ.4.11 కోట్ల మేర నిధులు పొందినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కీసర సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన సమయంలో పలు అనుమానాస్పద సేల్ డీడ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆయా పత్రాలను బ్యాంకుల్లో టైటిల్, సెక్యూరిటీ పత్రాలుగా సమర్పించి రుణాలు పొందినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ రికార్డులు, వివాదాస్పద సేల్ డీడ్లు, జిపిఏ, ఏజిపిఏ పత్రాలు, థంబ్ ఇంప్రెషన్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర నిందితుల వెల్లడింపుల ఆధారంగా మాజీ సబ్రిజిస్ట్రార్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు యూసుఫ్-ఉర్-రహ్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన వెల్లడింపు ఆధారంగా నివాసం నుంచి కేసులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రతులు, ఇతర కీలక డాక్యుమెంటరీ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం చట్టప్రకారం అరెస్ట్ చేసి, సంబంధిత ఏడు కేసుల్లో న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గృహ రుణాల మోసం కేసులో నిందితులు నకిలీ పత్రాలతో రుణాలు పొంది కొంతకాలం ఈఎంఐ లు చెల్లించి బ్యాంకుల అనుమానం రాకుండా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఈఎంఐ లు నిలిపివేయడంతో బ్యాంకులు ఆస్తులను పరిశీలించగా, కొన్ని ఆస్తులు ఉనికిలో లేకపోవడం, సర్వే, ప్లాట్ నంబర్లు తారుమారు చేయడం, నకిలీ లింక్ డాక్యుమెంట్లు ఉపయోగించడం వంటి అంశాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల అరెస్ట్, నేరం ద్వారా వచ్చిన డబ్బు, ఆస్తుల గుర్తింపు, మరిన్ని మోసపూరిత లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు స్థిరాస్తి కొనుగోలు లేదా గృహ రుణం పొందే ముందు టైటిల్, లింక్ డాక్యుమెంట్లు, సర్వే నంబర్లు, ప్లాట్ నంబర్లు తదితర వివరాలను సంబంధిత రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు, నకిలీ పత్రాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు తెలియజేయాలని కోరారు. ఈ దర్యాప్తు మల్కాజిగిరి సీపీ బి. సుమతీ ఐపీఎస్ పర్యవేక్షణలో, జవహర్నగర్ ఏసీపీ ఎస్. చక్రపాణి మార్గదర్శకత్వంలో కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్ఐ ఎస్. అనిల్కుమార్, సిబ్బంది నిర్వహిస్తున్నారు.






