రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 15 : నృత్యదీక్షాలయ ఆధ్వర్యంలో
నృత్య గురువు లక్ష్మీ శంకర్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన కళోపాసన 2026 – (4వ ఎడిషన్) శనివారం సాయంత్రం
భారతీయ విద్యాభవన్ లో నిర్వహించారు . స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవం కూచిపూడి సంప్రదాయాన్ని యువతరానికి చేరువ చేయడంతో పాటు, వివిధ గురుపరంపరలకు చెందిన యువ కళాకారులకు వేదిక కల్పించింది. కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి ఎక్స్పోనెంట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత యామిని రెడ్డి ముఖ్య అతిథిగా, ప్రముఖ కర్నాటిక్ వోకలిస్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత
లహరి కొలాచెల ఆత్మీయ అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి నృత్య ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ ఏడాది ఐదుగురు యువ కళాకారిణులు తమ ఏకల ప్రదర్శనలతో అలరించారు. వీరికి “నాట్య వికాస్ అవార్డు" అనే అవార్డు తో సత్కరించారు. శ్రావణి ముదిరాజ్, సయోజి ఆశ్రిత, రుత్విక నలమలపు, లక్ష్మీ రఘునాథ్, శ్రుతి సామన్విలు ఆనంద తాండవం, పరులన్న మాట, లక్ష్మీ ప్రవేశం, ప్రహ్లాద పట్టాభిషేకం శబ్దం, ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్ తరంగం, మహాదేవ శివ శంభో, చక్కని తల్లికి, భామ ప్రవేశ దరువు, ధనశ్రీ తిల్లానా వంటి వైవిధ్యభరితమైన అంశాలతో కళాకారిణులు తమ ప్రతిభను చాటారు. “భారత సామ్రాజ్య సుఖి” కార్యక్రమం చివరలో ఐదుగురు కళాకారిణులు కలిసి “భారత సామ్రాజ్య సుఖి” ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ్ రాగంలో రూపొందిన ఈ సమిష్టి ప్రదర్శన దేశభక్తి, జాతీయ ఐక్యత, భారతీయ సంస్కృతి కూచిపూడి వైభవాన్ని ప్రతిబింబించింది. వివిధ గురుపరంపరల నుంచి వచ్చిన ఐదుగురు కళాకారిణులు చివరగా ఒకే వేదికపై కలసి ప్రదర్శించడం “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ స్ఫూర్తిని నృత్యరూపంలో చాటింది. ప్రేక్షకుల కరతాళధ్వనులతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. యువ కళాకారులకు వేదిక, గురుపరంపరలకు గౌరవం, కూచిపూడి భవిష్యత్ తరాలకు ప్రేరణగా కళోపాసన 2026 మరో విజయవంతమైన అధ్యాయాన్ని నమోదు చేసింది.





