చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.
మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళా వెంకట కళా దీక్షితులు కళావేదిక'లో 'సినీ, లలిత గీత గాంధర్వం' ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర్ గుప్తా పాల్గొని సూర్య నారాయణ, హనుమంత రాయశర్మ, రమేష్, విరోబా, కేఎల్ జి ప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవెల శేషు కుమార్ బృందం చే సినీ గీతాలతో పాటు
స్వరకర్త, గేయకర్త 'కలగా' కృష్ణ మోహన్ బృందం శీలం రమణ, తిరుపతి రెడ్డి, మాధవి, అమృతవల్లి భాష్యం ఆధ్వర్యంలో ఆలపించిన లలిత గీతాలు అలరించాయి. ఉభయ రాష్ట్రాల ప్రఖ్యాత సీనియర్ గాయని నిర్మలా కామేష్ తమ గాత్రంతో అలరించారు. కె. మోహన్ రావు సారథ్యంలో తెలుగు కవితాగోష్ఠి నిర్వహించారు. మోహన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పేదలకు లక్ష కిలోల బియ్యం పంపిణీ" లో భాగంగా ఇప్పటివరకు 15,699 కిలోల బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు, త్వరలోనే లక్ష కిలోల లక్ష్యాన్ని చేరుకుంటామని నిర్వాహకులు గాంధీ తెలిపారు.






