హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10:
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని
సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారన్నారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసినందుకు సభ్యుల్ని సీఎం అభినందించారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టడం జరిగిందని, సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని, ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్ లో రాజకీయంగా రాణించలేరన్నారు. అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని వివరించారు.
సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలని, అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారని.. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని సీఎం అన్నారు. పోలీస్ సిబ్బందిలో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారని.. అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారని మండిపడ్డారు. దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్ అని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత సీఎం అన్నారు. తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందన్నారు. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని, సర్ అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.





