హాలియా: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శ్రీ శ్లోక పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ శ్లోక పాఠశాల విద్యార్థులు, చైర్మన్ డాక్టర్ కుకుడాల ఆంజనేయులు కలిసి హాలియా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై కె. సాయి ప్రశాంత్కు మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కుకుడాల ఆంజనేయులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించిన వారవుతారని తెలిపారు.
ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సాదియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





