* ఇద్దరు యువకులతో పాటు మరో వ్యక్తికి న్యాయస్థానం వినూత్న శిక్ష..
నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3 :
మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాచారం అంబెడ్కర్ నగర్ లో మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన లడ్డ భాను (29), చిల్కా నగర్ కు చెందిన వంశీకృష్ణ (21), అభిషేక్ బిస్వాల్ (20) లను పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ముగ్గురికి రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించారు. మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం వ్యక్తిగత తప్పిదమే కాకుండా సమాజానికి అసౌకర్యం కలిగించే చర్య అని పోలీసులు పేర్కొన్నారు. నేరానికి కేవలం శిక్ష విధించడమే కాకుండా, సమాజ సేవ ద్వారా బాధ్యతను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. యువత మద్యం, న్యూసెన్స్ కు దూరంగా ఉండి ప్రజా ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యత కూడా ప్రతి పౌరుడి కర్తవ్యమేననే సందేశాన్ని ఈ శిక్ష చాటుతోంది.





