చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: ‘భీమన్న సాహితీ నిధి’ ‘కళానిలయం’ సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మధురగాయిని, ఉత్తమ ఉపాధ్యాయురాలు, ప్రముఖ రచయిత్రి హైమావతి భీమన్న జన్మోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి పాల్గొని హైమావతి భీమన్న తల్లిదండ్రులైన స్వర్గీయ " కొత్తూరి వేంకట లక్ష్మి - కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు" స్మారక పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి, కవయిత్రి డాక్టర్ కేతవరపు రాజశ్రీకి
2026 సంవత్సరానికి గాను ఈ పురస్కారం కింద రూ. 5,116/- నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 21 సంవత్సరాలుగా కవులను, రచయితలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
సభకు ముందు మంజీర అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ అధ్యక్షురాలు , ప్రముఖ నాట్య గురువు జె. రేణుకా ప్రభాకర్
శిష్య బృందం ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం
పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య బి. గౌరీ శంకర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ కొయ్యి కోటేశ్వర రావు, రచయిత్రి, సంస్థ అధ్యక్షురాలు హైమావతి భీమన్న,
మాజీ డిఎస్పి సుంకర సత్యనారాయణ , ప్రముఖ రచయిత్రి డాక్టర్ గురువాడ శోభా పేరిందేవి, కళానిలం అధ్యక్ష కార్యదర్శులు ఎం సురేందర్ , ఎం పుష్పలత పాల్గొన్నారు.








