హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:
ప్రముఖ రచయిత్రి, నటీమణి, దర్శకురాలు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్ డా. పి. భానుమతి రామకృష్ణ 102వ జయంతిని పురస్కరించుకుని ‘వంశీ-భానుమతి జాతీయ సాహితీ పురస్కారం-2026’ను ప్రముఖ రచయిత్రి, సామాజిక సేవావేత్త, గైనకాలజిస్ట్ డా. ఆలూరి విజయలక్ష్మికి ప్రదానం చేయనున్నారు.
వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో లేఖిని తెలుగు రచయిత్రుల మహావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశం సభకు అధ్యక్షత వహించనుండగా, రచయిత్రి డా. అమృతలత సభను ప్రారంభించనున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.
వంశీ సంస్థల వ్యవస్థాపకుడు కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు స్వాగతోపన్యాసం చేయనున్నారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. వంశీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి శైలజ సుంకరవల్లి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా భానుమతి రామకృష్ణ సాహిత్యం, నటనా వైదుష్యం, ‘అత్తగారి కథలు’, ‘నాలో నేను’ తదితర రచనలపై సాహితీవేత్తలు, రచయిత్రులు ప్రసంగించడంతో పాటు భానుమతి ఆలపించిన పాటల ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.





