ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,5. అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేలా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన బన్సీలాల్ పేట లోని బండ మైసమ్మ నగర్ లో ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తమకు విద్యుత్ మీటర్లు లేవని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది తమకు ఇండ్లు రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గా కేసీఆర్ అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంకా కొన్ని ఇండ్లు కేటాయించాల్సినవి ఉన్నాయని, వాటిని అర్హులకు ఇవ్వాలని కలెక్టర్ కు లేఖ కూడా వ్రాశామని అన్నారు. అర్హులైన వారికి త్వరగా ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు తెలియకుండానే షాపులను వేలం వేశారని, కాలనీ వాసులు చెప్పగా, షాపుల ద్వారా వచ్చే అద్దెను కాలనీ నిర్వహణకు ఖర్చు చేయాలనే ఆలోచనతోనే షాపులను నిర్మించినట్లు వివరించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కవాడిగూడా DC పుష్పాలత, ఎలెక్ట్రికల్ ADE దుర్గ ప్రసాద్, హార్టికల్చర్ అధికారి సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, కుమార్ యాదవ్, ఫహీం, రంజిత్, అబ్బాస్, వినయ్, సాయి తదితరులు ఉన్నారు.
ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ మోసాలపై శనివారం బన్సీలాల్ పేట లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.








