ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు10:
విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు మంచి విద్యను కూడా
అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.గురువారం మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు.ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని అందులో ఇంటర్మీడియట్ మరియు పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విధులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా అనే విషయాలను కూడా పరిశీలించారు.స్టోర్ రూమ్ను తనిఖీ చేసిన కలెక్టర్, నిల్వ ఉన్న ఆహార పదార్థాల నాణ్యత, వాటి గడువు తేదీలను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా తెలుసుకొని, గురువారం రోజు అందించనున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థిని ఈశ్వ జాతీయ స్థాయి సైయిలింగ్ క్రీడల్లో పాల్గొన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. సైయిలింగ్ క్రీడను ఎంచుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలో సైయిలింగ్లో పాల్గొనాలనే తన ఆకాంక్షను విద్యార్థిని కలెక్టర్కు తెలిపారు.ఇందుకు అవసరమైన సహాయం, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డి సి ఓ మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






