హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15; గత భారాస ప్రభుత్వం ధరణి పేరుతో చేసిన భూ దోపిడీ ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ధరణి భూ దోపిడీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామంటూ సీఎం రేవంత్ ముందుగానే ప్రకటించారు. దమ్మంటే అసెంబ్లీకి రావాలని, చర్చలో పాల్గొనాలని కూడా ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే శనివారం 22 ఏ అంశంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఉదాహరణలతో భారాస హయాంలో జరిగిన ధరణి ల్యాండ్ స్కామ్ పై వివరణ ఇచ్చారు. సహచర మంత్రులు సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వ వివరణ పట్ల పరోక్షంగా సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు (మంగళవారం) ఏంహెచ్ఆర్డీ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి వెల్లడించిన భూ దోపిడీపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించేలా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వాసనీయ వర్గాల సమాచారం.
భారాస కు ఉహించని షాక్!
నిషేధిత భూముల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గత కొన్ని వారాలుగా భారాస దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది.
ధరణి అమల్లో ఉన్న కాలం సహా భారాస హయాంలో జరిగిన మొత్తం భూ లావాదేవీలపై సమగ్ర దర్యాపు
జరిపించేలా మంత్రులతో జరిగే సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
22-ఏ వ్యవహారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా చర్చించనున్నారు. శాసనసభ తిరిగి బుధవారం సమావేశం కానున్నందున 22- ఏ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించి భారాస కు చేసిన అక్రమాలు బహిర్గతం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేడే మంత్రులతో జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బుధవారం అసెంబ్లీ వేదికగానే సీఎం ప్రకటించే అవకాశముంది.. దర్యాప్తు విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత భారాస లీడర్లలో ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారి తెలంగాణ భవన్ 22-ఏ బాధితుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటెజీ రూపొందించబోతున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.





