ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం కాదు, ముందుగా పాలనలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు చావు డప్పు కొడతామంటున్న కాంగ్రెస్ నాయకులు ముందుగా క్షేత్రస్థాయికి వెళ్లి చూడాలని, అక్కడ ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే చావు డప్పు కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.అధికార మత్తులో ఉండి కాంగ్రెస్ నాయకులు ఇంకా మేలుకోలేకపోతున్నారని కల్లూరి రామచంద్ర రెడ్డి విమర్శించారు.ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.సభకు వస్తున్న మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత లక్ష్మారెడ్డి చీర కొంగు లాగి ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా అణచివేత ధోరణి వీడి, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని, లేని పక్షంలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.





