* ఆశ్రయం కల్పించి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు..
* పత్రికల్లో వచ్చిన ఫొటోలతో కుటుంబ సభ్యుల గుర్తింపు..
చిలకలగూడ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలకు చిలకలగూడ పోలీసులు అండగా నిలిచారు. తప్పిపోయిన వారిని కేవలం గుర్తించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల చెంతకు క్షేమంగా చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆగస్టు 31న చిలకలగూడ పోలీసుల పరిధిలో కనిపించిన బాలమణి, గోవిందమ్మలను ముందుగా డ్రీమ్ ఇండియా హోమ్లో ఆశ్రయం కల్పించారు. అనంతరం వారి వివరాలు, ఫొటోల ఆధారంగా కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీశారు. పోలీసుల ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గోవిందమ్మ కుటుంబ సభ్యులు సమాచారం అందుకుని పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆమెను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు వికారాబాద్ కు చెందిన బాలమణి ఫొటోను పత్రికల్లో చూసిన కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీసులను సంప్రదించారు. వివరాలను పరిశీలించి గుర్తింపును నిర్ధారించిన పోలీసులు డ్రీమ్ ఇండియా హోమ్ నుంచి బాలమణిని తీసుకొచ్చి ఆమె బంధువులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపి ఇద్దరు మహిళలు తిరిగి తమ కుటుంబాలను చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నో ఆందోళనల తర్వాత తమ వారిని సురక్షితంగా తిరిగి చూసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో చిలకలగూడ పోలీసులు చూపిన చొరవ, ఆప్యాయతకు స్థానికుల నుంచి అభినందనలు వ్యక్తమయ్యాయి.






