ట్రైనెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు08:
తెలుగు నేలపై నిజాయితీకి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన పోలీస్ అధికారి ప్రతికంఠం కిష్ణమరాజు. వారి శత జయంతి (1926-2026) ఈ సంవత్సరం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.
జననం, బాల్యం, విద్యాభ్యాసం: పూర్వపు వరంగల్ జిల్లా, కోడూరు గ్రామం వీరి జన్మస్థలం. తల్లి రాధమ్మ, తండ్రి సోమరాజులకు జన్మించారు. ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్లతో కూడిన పెద్ద కుటుంబంలో ఒక అన్న, ముగ్గురు తమ్ముళ్లు వీరికి ఉన్నారు. ఆ రోజుల్లోనే విద్యను అభ్యసించడానికి జనగాం వెళ్లి, ఆ ప్రాంతంలోనే
ప్రాథమిక విద్య పూర్తిచేసారు. హన్మకొండలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. మొదటి పట్టభద్రునిగా ఉస్మానియాలో డిగ్రి పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. చదువు పట్ల వారికున్న తపన, ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేయడం అనేది వారి పట్టుదలకు నిదర్శనం. తర్వాత న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.
పోలీస్ శాఖలో చెరగని ముద్ర:
ఉద్యోగ జీవితంలో 1960 లో సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రారంభించి పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ హోదాల్లో పనిచేసి, చివరకు అడిషనల్ ఎస్పీగా పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ మూసారాంబాగ్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన కాలంలో ప్రజల నోటిలో "సర్కల్ సాబ్"గా సుప్రసిద్ధులయ్యారు.ఆ కాలంలో పోలీస్ అంటేనే భయం. కానీ కిష్ణమరాజు దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉండేది. తన సర్వీస్ మొత్తం అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా, నిజాయితీకి కట్టుబడి పనిచేశారు. లాఠీ కంటే మాటకే విలువ ఇచ్చే అధికారిగా,పెద్దలను గౌరవిస్తూ, చిన్నలను ఆదరిస్తూ అందరి మన్ననలు పొందారు. వీరు సర్వీస్ లో ఎన్నో క్లిష్టమైన కేసులకు పరిష్కారం చూపారు.వీరి పేరు పోలీసు శాఖలో రాష్ట్రపతి మెడల్ కు రికమెండ్ చేసారు.పదవి విరమణ తర్వాత న్యాయవాది గా హైకోర్టులో ప్రాక్టీస్ చేసారు.
వీరు ఆచార్య బిరుదరాజు రామరాజు సమకాలికుడు దగ్గరి బంధువు బాల్య స్నేహితులు.
కుటుంబానికి పెద్ద దిక్కు, సమాజానికి మార్గదర్శి:
ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత కూడా తన మూలాలను మర్చిపోలేదు. తన కుటుంబ సభ్యులనే కాక, స్నేహితుల పిల్లలను సైతం చేరదీసి, వారికి ఆశ్రయం ఇచ్చి, చదువులు చెప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపారు. ఆయన ఇల్లు ఒక కుటుంబానికి ఆలయం, ఎందరికో ఆశ్రయం.
సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. తన స్వగ్రామం కోడూరు అభివృద్ధి కోసం, విద్య కోసం తన వంతు సహాయం అందిస్తూ ఉండేవారు.
శత జయంతి నివాళి: 1926 లో ప్రారంభమైన ఆ జీవన ప్రయాణం, ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలో, ఒక అధికారి ఎలా నడుచుకోవాలో, ఒక పెద్ద ఎలా ఆదుకోవాలో నేటి తరానికి సజీవ పాఠం. కిష్ణమరాజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారు నాటిన నిజాయితీ, ఆత్మీయత, సేవా భావం అనే విత్తనాలు నేడు మన కుటుంబంలో వృక్షాలై ఉన్నాయి. ఈ శత జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మనసారా నివాళులర్పిస్తూ, వారి ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవం.
కుటుంబ నేపథ్యం: వీరికి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు పెద్దకుమార్తె విజయలక్ష్మి భర్త డా.దేవరాజు మదన్ మోహన్ రాజు వీరి కుటుంబం లండన్ లో స్థిరపడ్డారు వీరు ప్రముఖ వైద్యులు.రెండవ కుమార్తె వసుంధర భర్త బిరుదరాజు అశోక్ రాజు వీరు ఆర్ టీ సి డిపో మేనేజర్ గా రిటైర్ అయ్యారు.మూడవ కుమార్తె అరుంధతి భర్త డా.చెన్నమాధవుని దామోదర్ రాజు వ్యవసాయ శాఖలో ప్రముఖ సైంటిస్ట్ గా వున్నారు.
పెద్దకుమారుడు పద్మనాభ రాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వుండి ఇటీవల దివంగతులయ్యారు.
రెండవ కుమారుడు శ్యాం సుందర్ రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో స్దిర పడ్డారు.మూడవ కుమారుడు గుణవర్థన్ రాజు సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా వున్నారు.జోహార్ ప్రతికంఠం కిష్ణమరాజుకి!అంటున్న ఆత్మకూరు(ఎం)మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు.






