* అక్రమ అడ్మిషన్లపై సమగ్ర విచారణ జరపాలి: తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్..
తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3:
తెలంగాణ లోని ప్రైవేట్ అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీ-కేటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ అడ్మిషన్ల రేటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీజీసిహెచ్ఈ) కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జివో నం. 74, 75, జీవో నం. 49, అలాగే 24-06-2026న టీజీసిహెచ్ఈ జారీ చేసిన బీ-కేటగిరీ అడ్మిషన్ మార్గదర్శకాలను పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉల్లంఘిస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. జెఈఈ మెయిన్, టీజీ ఈఏపిసిఈటి లో ప్రతిభ కనబరిచిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా కేటాయించాల్సిన సీట్లను భారీ మొత్తాలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జెఏసి పేరును ఉపయోగించుకొని కొన్ని కళాశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్న వ్యక్తులపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తీగల శివకుమార్, ప్రశాంత్, రామకృష్ణ, రమేష్ నాయక్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






