ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను మోసం చేసిన బీఆర్ఎస్: హెచ్ఆర్ మోహన్..
దళితులకు రాజకీయ, సామాజిక గౌరవం కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ మోసం చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ ఆరోపించారు. నాచారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల విషయంలో రాజయ్య, కడియం శ్రీహరి తదితర దళిత నేతలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తోందని హెచ్ఆర్ మోహన్ అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించడం సామాజిక గౌరవానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేపథ్యంలో, రాజ్యాంగబద్ధమైన పదవులను గౌరవించాలని సూచించారు. ఈ వ్యవహారంపై తాతా మధు తాను స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడలేదని వివరణ ఇచ్చిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎర్రవల్లి ఫామ్హౌస్ వద్ద దళితులు నిరసన చేపట్టిన అనంతరం పసుపు నీళ్లతో ప్రదేశాన్ని శుద్ధి చేశారంటూ వచ్చిన ఆరోపణలను హెచ్ఆర్ మోహన్ ప్రస్తావించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎర్రవల్లిలో ప్రభుత్వ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దళితులకు రాజకీయ పదవులతో పాటు ఐఏఎస్, ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దళితులకు ఆత్మగౌరవమే ముఖ్యమని, తమ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందని హెచ్ఆర్ మోహన్ పేర్కొన్నారు. దళితుల సమస్యలు, హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.





