హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్07
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికరెడ్డిని తార్నాక లోని ఆమె నివాసం లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు అనుమతి నిరాకరించారని కార్తికరెడ్డి తెలిపారు. బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు.
ప్రభుత్వం 1,000 రోజుల పాలన పేరుతో కోట్లాది రూపాయలు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మరోవైపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు.
విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, హామీలను అమలు చేయలేకపోతే విద్యాశాఖ బాధ్యత వహిస్తున్న వారు పదవికి రాజీనామా చేయాలని కార్తికరెడ్డి డిమాండ్ చేశారు.





