* ఆర్టీసీ భవన్లో చర్చలు రసాభాస.. సమావేశాన్ని బహిష్కరించిన పలు కార్మిక సంఘాలు..
ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :
ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ, మెట్రో సేవలకు ఆటోలు, క్యాబ్లను అనుసంధానం చేసే ప్రతిపాదనను ఆటో, యాప్ ఆధారిత రవాణా సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. శనివారం ఆర్టీసీ భవన్లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్ లతో జరిగిన సమావేశంలో దీనిపై వాగ్వాదం చోటుచేసుకుంది. మీసేవ ద్వారా ఒకే టికెట్తో బస్సు, మెట్రో, ఆటోలో ప్రయాణించే విధానాన్ని ఆర్టీసీ ఎండీ ప్రతిపాదించగా, రవాణా శాఖ కమిషనర్ దాని వివరాలను వెల్లడించారు. అయితే జేఏసీ నాయకుడు రవిశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 23న రవాణా శాఖ మంత్రి, కమిషనర్తో జరిగిన చర్చల్లో ఆర్టీసీలో ఆటో కనెక్టివిటీ ప్రతిపాదన లేదని లిఖితపూర్వకంగా తెలిపి, ఇప్పుడు ప్రతిపాదన ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి విషయంలో మూడో వ్యవస్థ మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు.
జేఏసీ నాయకులు మారయ్య, వెంకటేశం మాట్లాడుతూ ఆటో మీటర్ ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు జీఓపై చర్చించాల్సి ఉండగా కనెక్టివిటీపై సమావేశం నిర్వహించడం సరికాదన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వైట్ప్లేట్ బైక్లను సీజ్ చేయాలని మల్లేష్ గౌడ్, ప్రవీణ్ సలీం డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ బీఎంఎస్, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, బీఆర్ఎస్ నాయకులు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమ్మె చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.





