* వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే ప్రణాళిక
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షనీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్ఫూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్ షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని సీఎం అన్నారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్య దేవరాజన్, నవీన్ నికోలస్, శ్రుతి ఓజా, సైదులు, సంతోష్ ,సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





