హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ట్రైనెట్ న్యూస్):
అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో “ఏపీ పెన్షనర్స్ హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేషన్ మీటింగ్” శనివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన మందిరంలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ సమావేశంలో పెన్షనర్లకు అందుతున్న ఆరోగ్య సేవలు, వైద్య సదుపాయాలు, వాటి సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ డీజీఎం కె. సుధాకర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జిల్లా కోఆర్డినేటర్ డా. టి. రంగస్వామి రెడ్డి, ప్రైమ్9 టీవీ ఛానల్ సీఈఓ పి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన మార్కెటింగ్ విభాగాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఈజీలైఫ్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ డా. హిమ బిందు నల్లూరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ వైద్య పథకాలు, కార్పొరేట్ ఆసుపత్రుల సహకారం, వైద్య సేవల వినియోగంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో చర్చించారు. పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు కె. నళినీ మోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి టి.ఎం.బి. బుచ్చిరాజు, కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.






