ఆకట్టుకున్న "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం". చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 16: వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం" చిక్కడపల్లి త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త, ఎన్.ఎఫ్.సి మాజీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎన్. సాయిబాబా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ సాహిత్య రంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో డాక్టర్ ఎస్వీఎస్ నారాయణ మూర్తి, వంశీ ఆర్ట్ థియేటర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ వంశీ రామరాజు, సైకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ వేలూరి లక్ష్మీ గీత నిర్వహణలో వీణా వాద్య కచేరీ అలరించింది.
పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం కుమార్తె చావెలి బాల త్రిపుర సుందరి శిష్యురాళ్లు సమర్పించిన కూచిపూడి నృత్య రూపక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంపటి లక్ష్మీనారాయణ శర్మ పర్యవేక్షించారు.






