సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్ఐఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సింధూజ అన్నారు. హైదరాబాద్లోని కళ్యాణ్ యాంఫి థియేటర్లో సంస్కార భారతి, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 'బాలోత్సవ్' సంగీత, నృత్యోత్సవాలు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సింధూజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపకురాలు పద్మా కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి నెల ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సలహాదారు లయన్ డా. సింగిశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పద్మా కళ్యాణ్, శ్రీవల్లీ శర్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ గురువర్యుల శిష్య బృందాలు ప్రదర్శించిన సంగీత, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.




