హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం. తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం అని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతి మెయిన్ హాల్లో కల్చరల్ ఫెస్టివల్ 2026 వైభవంగా జరిగింది. 16 రకాల కళా రూపాలను సుమారు 170 మంది కళాకారులు ప్రదర్శించారు. ఈ కల్చరల్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ప్రజలలో చైతన్యాన్ని కల్పించేలా కళారూపాలను ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని, అందులో హైదరాబాద్ జిందాబాద్ లాంటి సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ జిందాబాద్ లాంటి పౌర సంస్థలు ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై కృషి చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారాన్ని, సేవలను అందిస్తున్నందుకు అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కళాభివృద్ధికి చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు.
ఈ కల్చరల్ ఫెస్టివల్లో "ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్" డ్రామా, ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన "సే నో టు డ్రగ్స్", "ఆర్గాన్ డొనేషన్" పై స్కిట్లు సందేశాత్మకంగా, ఆలోచింపజేసేలా ప్రదర్శించారు. ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాలు వేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకర్షించాయి.
కురుగంటి కళాక్షేత్రం సాంప్రదాయ భరతనాట్యం, ప్రఖ్యాత కళాకారులు గురు స్వామి పేరడీ, రవుఫుద్దీన్ స్టాండప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తానల్ మలయాళీ సేవాసమితి కేరళ సాంప్రదాయ తిరువతిర నృత్యం ప్రేక్షకులను ఆకర్షించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుమారు 100 హైస్కూళ్లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, పర్యావరణవేత్త డాక్టర్ జయ సూర్య, హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రముఖ టీవీ నటులు మలక్పేట శైలజ హాజరై బహుమతులు అందజేశారు.
కార్యక్రమాన్ని హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసరావు, కె. వీరయ్య, ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసరావు, పి. నాగేశ్వరరావు, మోహన్ నాయుడు, సంగీత, శ్రీవల్లి, మాధవి సుకుమార్, రాజమౌళి, నాగేష్, శంకర్ సమన్వయం చేశారు.








